Friday 30 August 2024

Karthika deepam august 30th episode


రాఖీ కట్టే దగ్గర గొడవ చేసిన జ్యోత్స్న- స్వప్నకు పెళ్లి ఫిక్స్ చేసిన శ్రీధర్

పారిజాతం ఇంట్లో తెగ హడావుడి చేస్తుంది. అప్పుడే దాసు, కాశీ ఇంటికి వస్తారు. కాశీకి ఇంట్లో అందరినీ పరిచయం చేస్తుంది. జ్యోత్స్నను చూపించి అక్క అని దాసు చెప్తాడు. కార్తీక్, కాంచన కూడా వస్తారు. శ్రీధర్ రాలేదని సుమిత్ర అలుగుతుంది. కార్తీక్ దాసును చూసి మీరేంటి ఇక్కడికి వచ్చారని అడుగుతాడు.

నిజం తెలుసుకున్న కార్తీక్

కాంచన దాసు పారిజాతం పిన్ని కొడుకు అని చెప్తుంది. కాశీ తన మనవడని పారిజాతం చెప్పడంతో స్వప్న ప్రేమను కార్తీక్ గుర్తు చేసుకుని షాక్ లో ఉండిపోతాడు. నువ్వు హాస్పిటల్ కి వచ్చినప్పుడు కాశీ దాసు మావయ్య కొడుకు అని ఎందుకు చెప్పలేదని కార్తీక్ అడుగుతాడు.

అప్పటి పరిస్థితిలో నువ్వు జ్యోత్స్న మీద కోపంగా ఉన్నావని కవర్ చేస్తుంది. ఇప్పుడు స్వప్నతో కాశీ పెళ్లి ఎలా జరుగుతుంది. పెళ్లి చేయాలంటే స్వప్న తండ్రి ఎవరో అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నాన్న గురించి అమ్మకు తెలిస్తే ఏంటి పరిస్థితని కార్తీక్ టెన్షన్ పడతాడు.

దీప కట్టిన రాఖీ తీసేయ్

శివనారాయణ వస్తే కాశీని ఆశీర్వాదం తీసుకోమంటాడు. కానీ వద్దు రాఖీ ఏదో కట్టించుకుని వెళ్ళమని సీరియస్ గా చెప్తాడు. జ్యోత్స్న కాశీకి రాఖీ కట్టేందుకు బొట్టు పెడుతుంది. నేను చేసిన తప్పును నా చేతులతోనే సరిదిద్దుకుంటున్నానని డైలాగ్ కొడుతుంది. ఇక అపార్థాలు అన్నీ తొలగిపోయినట్టేనని కాంచన అంటుంది.

జ్యోత్స్న రాఖీ కట్టే ముందు చేతికి రాఖీ ఉండటం చూసి ఎవరు కట్టారని అడుగుతుంది. దీపక్క కట్టిందని చెప్పేసరికి జ్యోత్స్న సీన్ క్రియేట్ చేస్తుంది. నేను ఈరోజు బతికి ఉన్నాను అంటే అది దీపక్క వల్లే కదా అంటాడు. ముందు దీప కట్టిన రాఖీ తీసేయమని అడుగుతుంది.

నీకు రాఖీ కట్టడమే ఎక్కువ

అలా తీయకూడదు అనేసరికి జ్యోత్స్న కార్తీక్ ముందు మంచిదాన్ని అనిపించుకోవడం కోసం మనసు చంపుకుని రాఖీ కడుతుంది. పారిజాతం సంతోషిస్తుంది. తర్వాత కాంచన తన అన్న దశరథకు ప్రేమగా రాఖీ కడుతుంది. రాఖీ కడితే ఏదైనా ఇవ్వాలి కదక్క నా దగ్గర ఈ ఐదొందలు ఉన్నాయి తీసుకోమని కాశీ ఇవ్వబోతాడు.

నీకు నేను రాఖీ కట్టడమే చాలా ఎక్కువ, నీ స్థాయి వేరు నా స్థాయి వేరు. నాకు గిఫ్ట్ ఇచ్చే రేంజ్ నీది కాదని అవమానకరంగా మాట్లాడుతుంది. కాంచన దాసును కూడా రాఖీ కడుతుంది. మీరంతా మంచి వాళ్ళు కానీ నా కూతురే ఏ మంచితనం లేకుండా పెరిగిందని దాసు బాధపడతాడు.

దీప కూడా కాశీ, స్వప్న గురించి ఆలోచిస్తుంది. అనసూయ ఇంటి కాగితాలు తీసుకొచ్చి దీప చేతిలో పెడుతుంది. వాటితో పాటు కొంత డబ్బు కూడా ఇస్తుంది. అప్పులు తీరుస్తానని నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవి అని చెప్తుంది. ఇన్నాళ్ళూ గడ్డి తిన్నాను ఇప్పుడు అన్నం తింటున్నాను.

నోరుజారిన అనసూయ

ఏ సంబంధం లేనివాడు కార్తీక్ బాబు నా కొడుకు చేసిన అప్పులన్నీ తీర్చాడు. నువ్వు కష్టపడిన డబ్బులు నీ దగ్గరే ఉండాలని వాటిని చేతికి ఇస్తుంది. ఇక నువ్వు నీ కూతురు గురించి ఆలోచించు అసలే దాని ఆరోగ్యం కూడా సరిగా లేదని అనసూయ నోరు జారుతుంది.

నా కూతురి గురించి ఏదైనా నిజం దాస్తున్నావా అని దీప అత్తను నిలదీస్తుంది. అదేమీ లేదు ఈ ఆస్తిని నీ దగ్గర పెట్టుకో. నీకు కూతురు ఉంది, అవసరం వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఈ ఆస్తి కాపాడుతుంది. మనలాంటి కష్టాలు శౌర్య పడకూడదని అంటుంది. అత్త మాటలకు దీప చాలా సంతోషిస్తుంది.

స్వప్నకు పెళ్లి చూపులు

నేను ఇప్పటి వరకు ఇద్దరు మంచి వాళ్ళను చూశాను. ఒకరు మీ నాన్న, రెండో వాళ్ళు కార్తీక్ బాబు అంటుంది. సొంత మనిషి కాకపోయినా చాలా సాయం చేస్తున్నాడని కార్తీక్ ని మెచ్చుకుంటుంది. ఫంక్షన్ ఉందని అబద్ధం చెప్పి స్వప్నను కావేరీ అందంగా రెడీ చేస్తుంది. శ్రీధర్ అబ్బాయిని తీసుకుని ఇంటికి వస్తాడు.

శ్రీధర్ స్వప్నకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు. అబ్బాయిని పరిచయం చేసి ఇతనే నీకు కాబోయే భర్త అనేసరికి షాక్ అవుతుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.

Brahmamudi August 30th Episode


 
అడ్డంగా బుక్కైన అక్కాచెల్లెళ్లు- కావ్య కంటే కుటుంబమే ఎక్కువన్న రాజ్


బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 30వ తేది ఎపిసోడ్‌లో రాహుల్ దొంగబంగారం కొంటున్నట్లు నిరూపిద్దామనుకుంటారు అక్కాచెల్లెళ్లు కావ్య స్వప్న. కానీ, రాహుల్ నిర్దోషి అని తేలుతుంది. కావ్యపై ఫైర్ అయిన రాజ్ ఇంటిని ముక్కలు చేద్దామనుకుంటున్నావా అని మాటలు అంటాడు.


రాహుల్ ఇల్లీగల గోల్డ్ కంపెనీకి కొనేందుకు ఇవాళ ఆఫీస్‌కు వెళ్తున్నాడని కావ్యకు చెబుతుంది స్వప్న. కావ్య ఆలోచిస్తుంటే.. ఇంకా ఏం ఆలోచిస్తున్నావే.. అందరి ముందు ఈ విషయం బయటపెడదాం అని స్వప్న అంటుంది.

అలా చేస్తే.. రాహుల్‌ అందరిముందు చెడ్డవాడు అవుతాడు. కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటాడు అని కావ్య అంటుంది. అయితే కానీ, నా భర్త కంపెనీ బాధ్యతలు తీసుకుంటే సంతోషమే కానీ, ఇలా ఆస్తులు పోగొడతాడని తెలిస్తే.. ఇరికించడానికి నేను సిద్ధమే అని స్వప్న అంటుంది. భర్త కంటే ఆస్తులు ఎక్కువ అన్న నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఉమ్మడి కుటుంబం ఎప్పుడు విడిపోదు అని కావ్య అంటుంది. పొగుడుతున్నావా తిడుతున్నావా అని స్వప్న అంటుంది.

రోజు డబ్బులొచ్చే పని

అది నీకు అర్థం కాదు కానీ, రాహుల్ ఎక్కడ అని కావ్య అంటుంది. ఆఫీస్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు అని స్వప్న అంటే.. రాని, అందరిముందు బయటపెడతా అని కావ్య అంటుంది. మరోవైపు ఇప్పుడు ఉద్యోగం సంపాదించి నెలకు వచ్చే జీతం కోసం చూడాలంటే కష్టమవుతుంది. రోజు డబ్బులు వచ్చే పని చూసుకోవాలి అని కల్యాణ్ ఆలోచిస్తుంటే.. కింద ఆటో అతను ఇవాళ స్కూల్ పిల్లలను తీసుకురాలేను అని చెబుతాడు.

ఆటో అతని దగ్గరికి వెళ్లి సార్ మీకు ఆటో నడిపితే ఎంతొస్తుంది అని కల్యాణ్ అడుగుతాడు. ఈ మధ్య ఆటో వాళ్లను సార్ అని పిలుస్తున్నారా. రోజుకు 500 నుంచి వెయ్యి రూపాయల వరకు వస్తుందని అతను చెబుతాడు. మీలాగే ఆటో నడుపుకుందామని అనుకుంటున్నాను అని కల్యాణ్ అంటే.. మీరు ఆటో కంపెనీ కొనేవాళ్లలా ఉన్నారు. కానీ, నడిపేవాడిలా లేరు. సరే అర్థమైంది. కోట్లు పోగొట్టుకుని నోట్లకోసం పాట్లు పడుతున్నారన్న మాట. ఎక్కడుంటారు అని ఆటో అతను అంటాడు.

పక్కనే అని వాళ్ల ఇల్లు చూపిస్తాడు కల్యాణ్. హో.. బంటిగాడి ఇంటికి వచ్చిన కొత్త జంట మీరేనా సరే. నేను సేటు నెంబర్ ఇస్తాను. అతని దగ్గరికి వెళ్లి నా పేరు చెబితే రెంట్‌కు ఆటో ఇస్తాడు. అన్ని ఖర్చులు పోను ఐదు వందలు మిగులుతాయని ఆటో అతను నెంబర్ ఇస్తాడు. కల్యాణ్ నెంబర్ సేవ్ చేసుకుని వెళ్లిపోతాడు. మరోవైపు రాహుల్ ఆఫీస్‌కు వెళ్తున్నట్లు రుద్రాణికి చెబుతాడు. నువ్ ఇలా ప్రయోజకుడివి కావడం కంటే ఏముంది అని రుద్రాణి అంటుంది.

నీ దబాయింపు ఏంట్రా

ఆగండి రుద్రాణి గారు వీర తిలకం దిద్దండి అంటూ కావ్య, స్వప్న వచ్చి సెటైర్లు వేస్తారు. ఏంటీ జంట కవయిత్రిల్లాగా కోరస్ మాట్లాడుతున్నారని రుద్రాణి అంటే.. మాకేం కాలేదు. మీకు మీ కోడుకు ఇత్తడి అవుద్ది అని స్వప్న అంటుంది. తాతయ్య గారు. ఆరోజు రాహుల్‌కు కంపెనీ బాధ్యతలు వద్దన్నానో ఇప్పుడు నిరూపిస్తాను అని కావ్య అంటుంది. ఇప్పుడు రాహుల్దానికి అంతా షాక్ అవుతారు. అది కనక బయటపడితే వందేళ్ల చరిత్ర ఉన్న మన కంపెనీ పరువు పోతుంది. దాంతోపాటు ప్రభుత్వం మన కంపెనీలన్నింటిని సీజ్ చేస్తే మన ఇంటి పరువు కూడా పోతుంది అని కావ్య అంటుంది. ఏరా.. అప్పుడే నీ బుద్ధి చూపించావా. అన్నం పెట్టే కంపెనీకే ద్రోహం చేస్తావా అని సుభాష్ అంటాడు. అప్పుడే కావ్య అడ్డుపడింది. అప్పుడే నేను ఇది ఊహించాను అని అపర్ణ అంటుంది. కుక్కను తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోబెడితే ఇలాగే ఉంటుందని ప్రకాశం అంటాడు.

సాక్ష్యం ఎక్కడిది

దోచుకోండి. తల్లీకొడుకులు అంతా కలిసి దోచుకోండి. బయటకు వెళ్లిపోయిన నా కొడుక్కి చివరకు చిప్పే మిగిల్చండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. మీ అమ్మ బతిమిలాడితే నీకు కంపెనీ అప్పజెబితే ఇదేనారా నువ్ చేసేది అని సీతారామయ్య అంటాడు. మరి ఇదంతా జరుగుతుంటే ఏం చేస్తున్నావ్ అని రుద్రాణిని ఇందిరాదేవి అంటుంది. ఆపండి.. ఆపండి.. నేనేం ఏం చేశాను. దొంగ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది. మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీకు సాక్ష్యం ఎక్కడిది. నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు. మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా అని రాహుల్ అడుగుతాడు. ఏం తప్పు చేశాడు అని రాజ్ అడుగుతాడు. మధ్యలో నీ దబాయింపు ఏంట్రా. చెప్పేవరకు ఆగు అని అపర్ణ అంటుంది.

వందేళ్లు పూర్తి చేసుకున్న స్వరాజ్ గ్రూప్‌కు ఏ మచ్చ లేదు. కానీ, రాహుల్ మాత్రం ఇవాళ దానికి మచ్చ తీసుకురాబోతున్నాడు. దాని వల్ల వ్యాపారానికే కాదు కుటుంబానికే పెద్ద నష్టం వాటిల్లుతుంది అని కావ్య అంటుంది. ఎందుకు కళావతి చీటికి మాటికి ఇష్యూ తీసుకొస్తుంటావ్. అంత తప్పు రాహుల్ చేస్తాడంటావ్ అని రాజ్ అంటాడు. అసలు ఏం చేశాడమ్మా వీడు అని సుభాష్ అడుగుతాడు. ఈ రాహుల్ అక్రమంగా దొంగ బంగారాన్ని కంపెనీ ద్వారా కొనడానికి సిద్ధపడ్డాడు మావయ్య అని కావ్య చెబుతుంది.

ఆ సాక్ష్యం నీ చేతుల్లోనే ఉంది అని కావ్య అంటుంది. ఏంట్రా ఇది. వాళ్లు చెప్పేది నిజమేనా. ఏముంది దీంట్లో అని రుద్రాణి డ్రామా చేస్తుంది. ఏంటీ బిత్తరచూపులు చూస్తున్నావ్. నేను అంతా విన్నాను. ఆ ఫైల్‌లో ఏముందో నేను అంతా చదివాను ఇటివ్వు అని స్వప్న ఫైల్ తీసుకుంటుంది. అది రాజ్‌కు ఇస్తుంది. ఇతని బాగోతం ఇందులోనే కనిపిస్తుందని స్వప్న చెబుతుంది. ఫైల్ రాజ్ చూస్తాడు. ఏం తప్పుంది స్వప్న ఇందులో అని రాజ్ అనేసరికి స్వప్న, కావ్య షాక్ అవుతారు.

ఇది మనం రెగ్యులర్‌గా గోల్డ్ సప్లై చేసే కంపెనీతో చేసుకున్న అగ్రిమెంటే కదా. ఇందులో దొంగ బంగారం కొంటున్నట్లు ఎక్కడ లేదు కదా. డాక్యుమెంట్స్ అన్ని అఫీషియల్స్‌గానే ఉన్నాయి కదా అని రాజ్ అంటాడు. మళ్లీ ఆ ఫైల్స్ అన్ని స్వప్న, కావ్య చూస్తారు. మొత్తం బ్యాగ్ వెతుకుంది స్వప్న. లేదు అది ఇది కాదు. ఫైల్ మార్చేశాడు. నా కళ్లతో నేను చూశాను. ఇంతలో ఎలా మాయం చేశావ్ అని స్వప్న అంటుంది. మా అక్కను ఫూల్‌ను చేద్దామనుకుంటున్నావా అని కావ్య అంటుంది.

పిచ్చిదాన్ని చేద్దామనుకుంటున్నావా

హేయ్ షటప్. రాజ్‌ను కాదని, రాహుల్‌కు కంపెనీ అప్పజెప్పినప్పటినుంచి కావ్యకు భగభగ మండిపోతుంది. అందుకే అక్కచెల్లెళ్లు కలిసి ఇలా చేశారు అని రుద్రాణి అంటుంది. కావ్య అడ్డుకుంటే.. ఇక చాలు నువ్ చేసింది. నోర్మూసుకుని ఉండు. బుద్ధి జ్ఞానం ఉన్నదానివే అయితే ఇలాంటి పనులు చేయవు అని రుద్రాణి అంటుంది. రుద్రాణి ఆపు.. నోరు గుక్కతిప్పుకోకుంటా అంటున్నావేంటీ. స్వప్న చూశానంటుంది. చదివానంటుంది. ఏ భార్య కూడా చేయని తప్పు భర్తపై మోపదు అని అపర్ణ అంటుంది.

కావ్య కూడా ఆధారం లేకుండా ఎవరిని అనదు. నిజంగానే నీ కొడుకు ఆ ఫైల్ మార్చాడేమో ఎవరికి తెలుసు అని అపర్ణ అంటుంది. పెద్దత్తయ్య మీరు కావ్యను నమ్మి నన్ను అంటున్నారు. ఫైల్ సంగతి పక్కన పెడితే అలా చేస్తే నేరం ఎవరిపై పడుతుంది. నా మీదే కదా. నేనే కదా ఆఫీస్‌కు వెళ్తున్నాను. అంటే నన్ను అందరిముందు దోషిని చేసుకోమంటున్నారా. తలో ఒక మాట అంటున్నారు అని రాహుల్ అంటున్నారు. ఎంత బాగా నటిస్తున్నావ్. నన్ను పిచ్చిదాన్ని చేద్దామనుకుంటున్నావా అని స్వప్న అంటుంది.

మీ ఇద్దరు కలిసి చేస్తున్నారు. నాన్న కావాలంటే రాజ్‌కే కంపెనీ అప్పజెప్పండి. కానీ, ఇలా మాటలు పడటం మా వల్ల కాదు అని రుద్రాణి అంటుంది. అలా ఎలా కుదురుతుంది. కల్యాణ్ వచ్చేవరకు రాజ్‌కు కంపెనీకి వెళ్లకూడదని మావయ్య గారే చెప్పారు కదా. మరి మాట ఎలా తప్పుతారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. స్వప్న మిస్ అండర్‌స్టాండ్ చేసుకుంది. కావ్య కూడా స్వప్న మాట విని పొరపాటు పడింది. రాహుల్ తప్పు చేయలేదని తెలిసింది కదా. అత్తకు, రాహుల్‌కు సంతోషమే కదా అని రాజ్ అడుగుతాడు.

ముక్కలు చేద్దామనా

ఇంకెందుకు ఈ వాదోపవాదాలు. అనవసరం. నేను వచ్చి సీటు లాక్కోను. ఇవాళ్టి నుంచి నువ్ ఆఫీస్‌కు రెగ్యులర్‌గా వెళ్లు అని రాజ్ అంటాడు. ఏవండి అది కాదండి అని కావ్య అంటుంది. కళావతి ఇంకొక్క మాట మాట్లాడిన నేను ఊరుకోను. రా ముందు అని కావ్యను పక్కకు తీసుకెళ్తాడు రాజ్. అది చూసి రుద్రాణి, రాహుల్ సంతోషిస్తారు. ఏంటిదంతా, ఇంటిని చీలిక చేద్దామనుకుంటున్నావా. ఫ్యామిలీని ముక్కలు చేద్దామనుకుంటున్నావా. ప్రతిసారి గొడవలు తీసుకొస్తున్నావ్. ఇంట్లో నాతోపాటు అందరికీ ఒక సమస్యలా మారిపోయావ్ అని రాజ్ అంటాడు.

వాళ్లు తెలివిగా తప్పించుకున్నారండి అని కావ్య అంటుంది. నువ్వే తెలివితక్కువగా అపార్థం చేసుకున్నావ్. నీ దగ్గర ఏముంది ఆధారం. ఆ తల్లీకొడుకులు ఇంటి సభ్యులు. వాళ్లను అవమానించిన, అనుమానించిన ఉమ్మడి కుటుంబంలో తుఫాను మొదలవుతుంది అని రాజ్ అంటాడు. తుఫాను వాళ్లే కాదు. మీ పిన్ని గారు కూడా సృష్టిస్తారు. నేను కాదు. నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు మీరు అని కావ్య అంటుంది. నీకోసం నేను నా కుటుంబ సభ్యులను వదులుకోలేను అని రాజ్ అంటాడు.

ఆటో నడుపుకుంటున్న కల్యాణ్

దాంతో కావ్య షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో కల్యాణ్ నమస్కరించి ఆటోలో బోణి కోసం ఎదురుచూస్తుంటాడు. వెనుక నుంచి కావ్య, స్వప్న వస్తుంటారు. వాళ్లను అద్దంలో చూసి కల్యాణ్ షాక్ అవుతాడు.

free web site traffic and promotion